Friday, 21 April 2017

పడమటర్ర.

   
     తాత,అమ్మమ్మలకు ఒక్కతేకూతురు అమ్మ .ఒకేఊరు. అమ్మమ్మ వాళ్ళిల్లు పాతబజారులో
    మాఇల్లుకొత్తబజారులో రోడ్డుకు దగ్గరగా వుండేది. వంటంతా ఇక్కడే. అమ్మమ్మ,తాతయ్యలు పొద్దున్నేచెలక,పొలం వ్యవసాయంఅంటూ వెళ్ళేవారు. వారికి సద్దిగిన్నెలు అన్నయ్యో,నేనో జీతగాళ్ళో
   తీసుకెళ్ళేవాళ్ళం.  సాయంత్రం కూడా సద్దిగిన్నెలు మాఇంట్లోంచి అమ్మమ్మ ఇంటికితీసుకెళ్ళేపని
   ఎక్కువగా నాకే వుండేది. ఆటైంలో నేనుఐదోతరగతో ఆరోతరగతో చదివేదాన్ననుకుంటా. అక్కడికి
   వెళ్లాలంటే చాలా వుత్సాహంగా వుండేది.

     అమ్మమ్మ పడమటర్రలో(గదిలో)బెల్లంకుండ వుండేది. మాకుతిరిగివచ్చేటపుడు చేతిమీద అరచేయి
    వెనుకవైపు నిమ్మకాయంత బెల్లం పెట్టి పంపేది. అదినాకుతూనాకుతూమాఇల్లు చేరేదాన్ని. అపుడపుడు
    అక్కయ్య కూడా తోడుగా వుండేది. ఆగది చీకటిగా గబ్బిలాలవాసనతో ఒక్కకిటికీ కూడాలేకుండా
     వుండేది. తడుముకుంటూ వెళ్లి బెల్లంకుండ ఎక్కడవుందీ కనిపెట్టేవాళ్ళం. మాతాతయ్య ఆయనజన్మించినసంవత్సరం(పింగళి) జన్మనామం వగైరా కాగితాలు,భూమికొన్న కాగితాలు ఎక్కడ
   ఎలా దాచేవారో తెలుసా ? లావాటి వెదురు కర్రల కణుపుల దగ్గర కట్ చేసి ఈకాగితాలు రోల్లాగా
   చుట్టి అందులో దూర్చి దానిపైమరో వెదురుబుర్ర తొడిగేవాడు. అందులో పేపర్లు వుంటాయని ఎవరూ
    ఊహించలేం కదా.
  
    ముఖ్యమైన సామానులన్నీ పడమటర్రలలోనే భద్రపరిచేది అమ్మమ్మ. గదినిండా కుండలూ,బానలూ,
    బస్తాలే . ధాన్యం, పప్పులు,బియ్యం,వడ్లు,ఉప్పుబస్తాలు,బెల్లంబుట్టలు,వేరుశనగలు,గోగునారతాళ్ళు,
     పశువులకు సంబంధించినసామాన్లు,పెద్దబోషాణం అందులోకొన్ని పట్టుచీరలు డబ్బులు ఇలా ఒకటేమిటి
    చీకట్లోఆగదిలోకెళ్తే కాళ్ళకువేళ్ళకు ఏవో తగుల్తూనే వుండేవి. దాదాపు 50 సంవత్సరాల గతం నామదిలో
    సజీవంగా నిక్షిప్తమై అపుడపుడు మలయమారుతంలా పలకరిస్తూనే వుంటుంది ఇలాగ.

Monday, 13 February 2017

అక్షరవనం



   నిన్ననేను ఒకమంచి కార్యక్రమానికి వెళ్ళాను .హైదరాబాదు నుండి రెండుగంటల ప్రయాణం కారులో. శ్రీశైలం వేళ్ళేదారిలో కల్వకుర్తి అనే ఊరిలో వందేమాతరం ఫౌండేషన్ వారి అక్షరవనం కార్యక్రమానికి వెళ్ళడంజరిగింది .మాధవరెడ్డిగారు తన స్వంతవ్యవసాయభూమిని, తన సమయాన్ని,తన పరివారం మొత్తంగా ఈప్రాజెక్టు పైనే వెచ్చిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు .ప్రభుత్వ పాఠశాలలనుండి పేద విద్యార్థులను తెచ్చి వారికి శిక్షణ ఇచ్చి వారిపై రీసెర్చి చేస్తూ భావి విద్యార్థులకు మేలైన విద్యను ఎలా అందించాలనే ఆలోచన ఆయనది. ఒక గ్రంధాలయం,ధ్యానమందిరం నిర్మాణంలో మాకుటుంబం పాలుపంచుకోవడం గర్వించదగిన విషయమని నేననుకుంటున్నాను. విశాలమైన వరండాలు,కూర్చోడానికి గ్రానైటుబెంచీలు,చుట్టూ మామిడిచెట్లు,చింతచెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్షరవనం రూపుదిద్దుకుంటున్నవైనం నన్నెంతో ఆకర్శిస్తూంది. వారి నినాదం చదవండి మరచిపోండి. బట్టీ విధానం కాకుండా చదువంటేభయంలేకుండా చేయడం. బడిపుస్తకాలు కాకుండా గ్రంధాలయంలోని పుస్తకాలు వారికిఅందుబాటులో వుంచి దాదాపు ప్రతి విద్యార్థి రెండువందల పుస్తకాలైనా చదవాలని,చదివినవి మెదడులో ఎక్కడో నిక్షిప్తమై వుంటాయనేవారి ఆలోచన బాగుంది. అలాగే పిల్లలే వంటచేయడం,అన్నిపనులు నేర్చుకోవడం వారికున్న నైపుణ్యాలుప్రదర్శించడం,వారే గురువులుగా మారిచెప్పడం, అన్ని విధాలుగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తున్నారక్కడ. గవర్నమెంటు టీచర్లు దాదాపు రెండువేలమంది ఇక్కడ ట్రైనింగు తీసుకుని వెళ్ళారంటే వీరి శ్రమ కృషి ఏపాటివో మనం అర్థం చేసుకోవాలి.  మాధవరెడ్డిగారి కుటుంబానికి,ఆ మహా యగ్నంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వారు ధన్యులు.

Friday, 6 January 2017

    ధన్యవాదాలు.


        గుండె గొంతుకలోన కొట్లాడుతోంది  తోవ తెలియక నాడు అల్లాడిపోయింది.
    
        చెప్పరే నా గొంతు ఎక్కడే దాగుంది  కూనిరాగాలు మౌన వీణంగ మార్చింది

      నా బంధుమిత్రువులు తోడుగా నిలిచారు  నాకోసమై వారు పరితపించారు

     ఎవ్వరే నాకిన్ని నీళ్ళు పోస్తోంది   చూడరే మారాకు చిగురు వేస్తోంది
  
     చాలదా ఇది నాకు బ్రతుకు భారాలేల  తిమిరంతో సమరాన గెలుపుభావాలెల్ల

     ధన్యవాదము చెప్ప నది చిన్నమాటాయె  వేరె దారిలేక రాతలే తోడాయె.

Tuesday, 27 December 2016

అమ్మా వనితా

!   
     అమ్మంటే. దేవత.ఈ పదంచాలదు  ఇంకా ఇంతకన్న విలువైన పదమేలేదా తెలుగులో .వెదకాలి!పుస్తకాల్ని తిరగేసి నిఘంటువుల్ని తిరుగతోడి,భాషాప్రవీణుల్ని సంప్రదించి ఆమెకు సముచిత సర్వోన్నత సగౌరవ పదం నేను పట్టుకోలేకపోయాను.

      నిస్వార్థజీవి  ఒంటరిపక్షి. ప్రేమతో తనపరివారాన్ని సంరక్షించుకొంటున్న ధీర. భర్త కోసం తల్లిదండ్రుల్నీ,అత్తమామల్నీ,బంధుమిత్రుల్నీ ,చిన్ననాటినేస్తాలైన కోళ్ళూ,కుక్కలూ,ఆవులూ చెట్లూ,పూలూ పళ్ళూ,లతలూ వీటితో తనకున్న బంధాలన్నీ త్రెంచుకుని కుసుమకోమలమైన హ్రిదయాన్ని కఠినంగాచేసుకుని ఆయన వెంట ఎంతోదూరం సునాయాసంగా వెళ్ళగలిగింది. ఇవన్నీ,వీరందరినీ వదిలి అల్లంతదూరాన ఎలావుండగలిగింది?  బహుశాఆతను అత్యంత ప్రేమగా చూసుకున్నాడేమో! వాటన్నింటినీ మరపించేంత మురిపించాడేమో.

     పిల్లలు   తన బుల్లి ప్రపంచంలోకి వచ్చాక ఇక జీవితంలో మరేమీ అక్కరలేదన్నంతగా వారిని పెంచేక్రమంలో తన అస్థిత్వాన్ని కోల్పోయినవైనం కూడా పట్టించుకోనంతగా మునిగిపోతుంది. లాలన పాలన,చదువులూ నిద్రలేనిరాత్రులూ  కోడి తన పిల్లల్ని రెక్కలలోదాచుకున్నట్లుగా తను పెంచుకున్నది. జీవితమంతా ఇలాగే తన కనుసన్నలలోనే వుండాలనుకుంటుందా పిచ్చిది. లోకంలో ఎలా జరుగుతోందో చూస్తూ కూడా తన ఇంట్లోఅలా కాదనే ఆశతోవుంటూ  పిల్లలమీద ప్రేమ చివరకు దేవుణ్ని,మాంత్రికుల్నీ,బాబాలను అందరినీ వేడుకుంటూ ఇక వారికి ఏఆపదా రాదన్న భరోసాతో పెంచుకుంటుంది.

     కాలం మనకోసం ఆగదుకదా! పెళ్ళిళ్ళు చేయాలి కని ఊరుకుంటే సరిపోదు ప్రయోజకుల్నీ చేయాలి మన పరిధుల్లో. ఆక్రమంలో మళ్ళీ తననుతాను మర్చిపోయి బాధ్యతలను అనుక్షణం గుర్తుచేసుకుంటూ వాటిని నెరవేర్చేటందుకు అహరహం శ్రమిస్తూ పూర్తిచేస్తుంది. ఆనక విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా రెండోతరం ఆటా పాటా ముద్దూమురిపాల కాలక్షేపాలతో  ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే హాయిగా నవ్వుతూ మరికొన్నాళ్ళు కాలంగడుస్తున్న సంగతేమరచిపోయింది.

     మెల్లగా  మళ్ళీ ఒంటరైపోతున్న భావన. ఆరోగ్యంకూడా దెబ్బతిన్నది. తననొకరు అనుక్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన సమయంలో.  . తనతోడు రెట్టించిన ఉత్సాహంతో ఊపుతో వ్రుత్తిలో మునిగి అదే జీవితమనే భ్రమలోవుంటూ పనులచుట్టూ పరిభ్రమిస్తుంటే చూస్తూ నిస్సహాయగా,బేలగా నిలబడి జీవితప్రయాణాన్ని కొనసాగిస్తూ... ఇదికాదు జీవించడం,ఇదికాదు జీవితమంటే అని  అన్నీ తెలిసిన మనిషికి చెప్పలేక చెప్పీ ప్రయోజనంలేక అలా నిలబడిపోయింది.

    ఒకపువ్వు పరిమళం,ఒకమొక్క మారాకు,మనపూదోటకొచ్చిన సీతాకోకచిలుక వన్నెలు , పసివాని బోసినవ్వులు నడవలేకనడుస్తూ లేస్తూపడుతూ పడేఅగచాట్లు, మనల్నే నమ్ముకుని జీవిస్తున్న ప్రాణులూ, మన పరివారం మంచిచెడ్డలూ, సాయంసంధ్యలోని అందాలూ ఉదయకిరణ అనుభూతులూ పంచుకుంటూ పేపరు వార్తలు చర్చించుకుంటూ ఒకరికొకరుగా సేవలు అందిస్తూ సదానవ్వుతూ ఆరోగ్యంగా వుంటూ జీవించాలనే తపన తప్పుకాదుగా.

   ఓ వనితా నీవు లే . నీవు ఇంకా ఎదగాలి. అన్నీ నేర్చుకుని నేర్పుగాజీవించాలి. అందరినీ ధిక్కరించడమే ఎదగడంకాదు. కుటుంబసభ్యులను మెప్పిస్తూనే నీ ఉనికిని చాటుకో.  కస్టమే కానీ నీవు అనుకుంటే సాధించగలవు. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించగన్ తెలుసుగదా మనకు. అందుకే చిన్నప్పుడే అన్ని విద్యలు,కళలునేర్పించాలి మన చిన్నారులకు. త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా  ఇలాంటివి దాటి  పదండి ముందుకు పదండితోసుకు పదండి పోదాం పైపైకి.

Tuesday, 1 November 2016

క్రిష్ణమ్మ

     ఎప్పటిదానవమ్మా నీవు! శాతవాహన రాణుల కుచకుంకుమల సౌరభంలో సహస్రాబ్దాల క్రితం పరవశించిన మూర్తివేనా?    ధరణికోట ప్రభువుల యుధ్ధనౌకలను చుంబించిన వేయేండ్లనాటి అమరమూర్తివేనా నీవు..

     బౌధ్ధ సన్యాసినీగణ స్నానఘట్టమై చరిత్రలో చెరుగకనిలిచిన దివ్యమూర్తివేనానీవు.  నాగార్జున పాదస్పర్శతో పరుసవేదిగా మారిన భవ్యమూర్తి నీవేనాతల్లీ! అమ్మా! క్రిష్ణమ్మా! ఎందరి కవిరాజుల గుండెలగలగలలో ఇవి. ఎందరు సీమంతులు వాడిన జలకపు పరిమళమో ఇది! 

      కోకిలలకు కాలపు నిబంధనలు లేవు. శారికలకూ,కీరాల కలరుతాలకూ చీకటివెలుగులు లేవు. పండి రాలిన పళ్ళను జలపక్షులు ఒడ్డుకువచ్చి ఏరుకుతింటాయి ఎల్లవేళలా. పామో-చేపో కూడా తెలియని పొడవాటి జలచరం మెడనిక్కించి మానవుణ్ని పలకరిస్తుందిక్కడ. మూరెడు తెప్పకొయ్యతో చేపలతో పోటీపడి కాపుపిల్లలు ఆవలిఒడ్దుకు పాకుతూ పోతారు నీళ్లల్లో.




(ఇది నా చిన్నప్పుడు చదివిన నవలలోనిది.బహుశా లల్లాదేవి రచనలోనిది అనుకుంటున్నాను.మా నాన్నగారు చాలా నవలలు, అపరాధపరిషోధన సిరీస్ , గోర్కి అమ్మ,చలం రచనలు,శరత్ రచనలు ఇలా చాలా తెచ్చేవారు. అపుడు నాకు నచ్చి నా నోట్స్ లో రాసిన వాక్యాలు ఇవి)

Saturday, 27 August 2016

మాఇల్లు మాచెట్లు.

   
   నల్గొండ జిల్లా,తుంగతుర్తి నియోజకవర్గం, మండల్ నూతనకల్ మాఊరు.మానాన్న,మామామయ్య,మాఅత్తయ్య ముగ్గురూ ఆ స్కూలులో టీచర్లు..ఆస్కూలు పక్కనే మాఇల్లు.

   నా చిన్నప్పుడు1970లలో మాఇంటిముందు యూకలిప్టస్,సన్నజాజి,కాగితంబఠాణీ    ఇంటిప్రక్కన కరివేపాకు,జామ,బొప్పాయి...అటుప్రక్కన నిమ్మ,బత్తాయి,దానిమ్మ,సీతాఫలం,బొడ్దుమల్లె,వేపచెట్లు,దొబ్బనిమ్మచెట్లు పెద్దగా పెరిగి మాకు నీడనిచ్చి. తోడుగా నిలిచాయి.మాతాతయ్య పెట్టించాడట ఆచెట్లని.

   పెద్ద ఇల్లూ స్కూలు పక్కనే ఉండటం,నాన్న టీచరూ,మాఇంట్లో కరెంటూవున్నందున నా ఫ్రెండ్స్,అక్కయ్య ఫ్రెండ్స్,అన్నయ్య ఫ్రెండ్స్ ఇంట్లో చాలా మందే ఉండి చదువుకునేవారు.జామచెట్టు కొమ్మలపై తలాఒకవైపు ఒరిగి బట్టీపట్టేవాళ్లం పాఠాలని.ప్రశ్నలకు జవాబులు ఒకరికొకరంఒప్పగించుకునేవాళ్లం. జామ లేతచిగురులో చింతపండు కలిపి నోట్లో పెట్టుకుని అలా చప్పరిస్తూ ఆనందించేవాళ్లం.

    నిమ్మచెట్టుకింద ఊడ్చి చాపలేసుకుని కూర్చుని కథలూ  కబుర్లూ చెప్పుకునేవాళ్లం.మధ్యాహ్నం రెండు మూడు గంటలసేపు ఇలా గడిచేది ఆదివారాల్లో,సెలవుల్గో. తుమ్మజిగురు తీసి ఒక సీసాలో దాచుకునేవాళ్లం.అగరుబొట్టు తయారు చేసేవాళ్లం.బొడ్డుమల్లె చెట్టుచుట్టూ తిరుగుతూ తెలుగుపద్యాలు కంఠస్తం చేసేవాళ్లం.పూరెక్కలు ఒక్కొక్కటి తీసి కాస్తనలిపి గాలిఊది ఎదుటివారి నుదుట చిటుక్కునకొట్టి టప్మనే శబ్దం రాగానే నవ్వుకొనేవాళ్లం.

    మాఇంటి ప్రాంగణంలో ఉప్పుబేరలు ఆడటం,ఇంటివెనుక ఒకగ్రూప్,ఇంటిముందు ఒకగ్రూప్ ఇసుకతో సన్నాయికుప్పలు ఆడేవాళ్లం.ఆకులకింద కూడాకుప్పలు పోసేవాళ్లం.లేదంటే బొగ్గుతో చుక్కలుపెట్టేవాళ్లం.

    బోగన్విల్లాపూలు అదేనండీ కాగితంపూలు పెద్దపెద్ద కొమ్మలుగా పూసేవి .వాటిని విరిచి మాతాతయ్య రుమాలులో తనకు తెలియకుండాగుచ్చేదాన్ని.చెలక దగ్గరకి అలా వెళ్తుంటే దారిలో అందరూ నవ్వుతుంటే గాని తెలిసి నవ్వేవాడట. రుమాలులో ఇంటికి వచ్చేటప్పుడు మాకోసం ఈత పళ్లు తెచ్చేవాడు.

    యూకలిప్టస్ ని అప్పుడు జమాయిల్ చెట్టు అనేవారంతా.ఊరంతటికీ ఒక్కమాఇంట్లోనే ఉండేదిఆచెట్టు.దాని ఆకులకై అందరూ మాఇంటికి వచ్చేవారు. పంటితీపు,తలనొప్పి,మాడుపోటుకు దీనిఆకులు వాడేవారు. మాతమ్ముడైతే పైసా రెండుపైసలకు అమ్మేవాడు.ఆపిల్లలు ఎందుకు కొనేదో ఇప్పటికీ అర్థం కాదు.

    ఇలా ఒక్కోచెట్టుతో నా అనుబంధం ఒక్కోకథలా నామదిలో నిక్షిప్తమైంది.ఆ ఫ్రెండ్స్ లోఒక కుటుంబమే తదుపరి నా కుటుంబమవడంతో అపుడపుడూ గుర్తుచేసుకుని ఆనందిస్తాము.చెట్లతో నా అనుబంధం మీతో పంచుకోవాలనే కోరిక రోజురోజుకూ పెరిగి ఇలా మీముందు పొందుపరిచాను.

Thursday, 4 August 2016

మానసి

         చిట్టితల్లీ ఎక్కడపుట్టావు ఎక్కడికి చేరావు.ఇది నీ అద్రృష్టమా లేక నాదా.  నీచిన్నిచేతులతో నా కెన్ని పనులు చేయాలని వచ్చావే.బహుశా నీకు తెలీదు లో కం పోకడ.అమ్మ నీడలొంచిదూరం పోతే లోకమెంత ని ర్దయురాలో

       ఎనీమియాతో వున్న నీచేతులు చల్లగా నా నుదురుపై అమృతాంజన్ రుద్దుతూంటే ఎంత హాయిగా వుందే నాకు. ఆటలాడి వచ్చిన నా కాళ్ల నొప్పులకు నీ మృదుకరస్పర్శతో విశ్రాంతి నిచ్చావు.

       ఎవరూ లేరని ఒంటరిగా కుములుతున్న నన్ను నేను లేనా అమ్మా  అంటూ ఎదురు ప్రశ్న వేశావు.విధి చేతిలో మేము విలవిల లాడినపుడు మౌనంగా మాకు ఆలంబనవైనావు.

      స్థబ్దంగా నడుస్తున్న మా జీవితాలలో నీపద మువ్వల సవ్వడితో జీవం పోసావు. అలసి సొలసి నిర్వేదనకు లోనైనపుడు నీ అమాయకపు నవ్వులతో మైమరపించావు.

       నా శ్వాస లో నా ధ్యాసలో నా ప్రతి కదలిక లో నా తోడువై నీడవై వున్న నీకు ఏమివ్వను తల్లీ నీ రుణమెలా తీర్చుకోనే నా మానస పుత్రీ.