Sunday, 16 June 2019

పంచేంద్రియాలు

మా పాత స్నేహితుల్లో ఒకజంట షష్టిపూర్తిచేసుకుంటున్నారని వెళ్ళాం.  నిజంగా అద్భుతం మేము
 వెళ్ళకుండా వుంటే చాలా మిస్సయ్యేవాళ్ళం. మిగతా ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి గా ప్రయాణించి
అక్కడికి చేరుకున్న మాకు పవిత్రమైన కర్పూరపరిమళాలు మా నాసికాపుటాలకు సోకి అల్లంత
దూరంనుండేఆహ్వానించాయి. కారుదిగుతూనే దూరంగా ద్వారబంధాలకు పందిళ్ళకువేసిన
పుష్పమాలాలంకరణ నయనానందకరం. ఎదురొచ్చిన పాతమిత్రుల పలకరింపు కరస్పర్షలతో
తనువంతా పండింది ఎండలో. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో పాజిటివ్ ప్రకంపనాలు
వీనులగుండా లోలోపలికి ప్రసరించి పవిత్రతనతో ఆపాదమస్తకం అలరించింది. వారిచ్చిన
విందుభోజనాలు మా జిహ్వచాపల్యాన్ని చల్లార్చి జఠరాగ్నిపై నీళ్ళుచల్లి సంత్రుప్తి పరిచాయి.
ఇలా మా పంచేంద్రియాలను సంతుష్టపరిచిఆనందంగా ఇల్లు చేరాము.

Monday, 13 May 2019

నాబలం

నువ్వేకదా నా బలం  నువ్వేకదా నా బలహీనత.
నువ్వే కదా  నేర్పావు నాలోఆత్మవిశ్వాసం
బేలనైన నన్ను ధీరవనితను చేసావు
తడేమిటి తంతోంది మనసు మాగాణి పారాలని
దేవుడో విధిరాతో తలరాతో ఎవరో ఏదో
మేలు చేయరామనకు అంతోఇంతో
తొందరపడి నేనెందుకు చింతచేయబూనాలి
ఎన్నోఇచ్చావు ఎన్నెన్నో చేసావు
నీకు చేయనాకులేని శక్తిని అరువుతెస్తున్నా
రోగాలతో సహవాసం చేయలేక చస్తున్నా
నా సు" మతి"కెన్ని సొట్టలో రాటుదేల జిందగిలో
ఆల్ఈజ్ వెల్ ఆల్ఈజ్ వెల్ అంటున్న గుండెగూటిలో
అయినా మదినిండా నీవిచ్చిన ధైర్యంతో
అలుపులేని పోరాటం గెలుపు తీరంవైపు పయనం.

Thursday, 4 April 2019

గర్విత

 
   ఆమె పంతులు బిడ్డ. అప్పుడప్పుడే పంతులు పోయి సార్ వచ్చేరోజులవి. నలభై ఏళ్ళ క్రితం మాట. పదోతరగతి ఫేలయ్యి నాన్నతోపాటూ రాజాపేట వెళ్ళింది.  రూంకి వున్న కిటికీలోంచి స్కూలుకు వస్తూవెళుతూ వుండే పిల్లలు అదిగోరా సారుబిడ్డ అదిగో అంటూ తనను చూస్తుంటే ఎంతో గర్వంగా వుండేది ఆరోజుల్లో. 
   ఆతర్వాత పెళ్లి పిల్లలు ఎక్కడో బొగ్గు బావిలో శ్రీవారి ఉద్యోగం. పుట్టిన ఊరి నుండి ఎంతో దూరం ప్రయాణం. అత్తమామల ఇంట పెద్ద కోడలై బంధు జనానికి తలలో నాలుకై ఆత్మబంధువైన గర్వంతో హ్రిదయం ఉప్పొంగినవేళ తనెంత అద్రుష్టవంతురాలోనని మురిసింది.  ఇలా కొన్నాళ్లు గడిచాక మళ్ళీ చదవాలనే కోరిక బలీయమై పదిలో మిగిలిన సబ్జెక్టు, ఇంటరూ, ఎక్ట్సర్నల్లో డిగ్రీచేసింది శ్రీవారి సహకారం తో .పదితోనే ఆగిన తన స్నేహితురాళ్ళను తలచుకుని మళ్ళీ గర్వపడింది.  కొడుకు ని ఇంటర్  విజయవాడలో చేర్చి చిన్నోడితోపాటూ హైదరాబాదు మకాం మార్చింది ఉద్యోగం వదలుకుని. పిల్లల్ని చెరోదేశంపంపింది పైచదువులకి  .జీవితంలో హడావుడి కాస్త తగ్గింది.  ఇంటి ముందు శుభ్రం చేయించి షటిల్ ఆడటం మొదలెట్టింది పదిమందితో. ఈఆట ఆమె జీవితానికే అఖండ దీపం అవుతుందని నాడు అనుకోలేదు.  నేడు అరవైయ్యోపడిలో వున్నా ఆడగలుగుతున్నందుకు మరీమరీ గర్విస్తున్నది.  భర్తతో, మరదులతో,తోడికోడలుతో,కొడుకులతో ఇపుడు మనవడితో మనవరాళ్ళతో కూడా ఆడుతున్నందుకు ఎంతో గర్వంగా వుందామెకు.  ఆరోగ్యం చెక్ పెట్టినా ఆటంటే లేచొస్తుంది ప్రాణం. ఇంటి నిండా కొడుకులు కోడళ్ళు మనవడూ,మనవరాళ్ళూ ఎనభై ఆరేళ్ల మాత్రుమూర్తితోసహా పనివారూ పరివారం తోడుగా ఎంతో సంతోషంగా చక్కని కుటుంబ బంధాలతో మహా గర్వంగా గడుస్తున్నాయి రోజులు.  ఇక  ప్రశాంతంగా సంత్రుప్తగా ఎప్పుడైనా ఏమైనా ఈజీవనయానం ఇలా సాగితే చాలు.

Saturday, 22 December 2018

కోటి దీపోత్సవం.

మొన్నీమధ్య కోటిదీపోత్సవానికి ఎన్టీఆర్ స్టేడియానికీ వెళ్లొచ్చాను .నిజంగా ప్రతివాళ్లూ ఓసారి తప్పకుండా చూడాల్సిన వైభోగమది . .గతసంవత్సరం మాకాలనీవాళ్ళు దాండియాగ్రూపుగావెళ్లి చూసొచ్చి చాలాబాగుందని చెప్పారు .చాలా ఆర్గనైజ్డుగా చేస్తున్నారు తొక్కిసలాట తోపులాట లాంటివి ఏవి లేవనిచెప్పారు .ఓసారి చూడాల్సినదేనని ఈసారి వారితోపాటూ నన్నుతీసుకెళ్ళారు ముఖ్యంగా నాతోటికోడళ్లు .గ్రూపంతా ఒకేరకమైన చీరలు కట్టగా నేనూ అదేరంగుచీరకట్టుకొని వారితోపాటు వెళ్ళాను .గ్రూపువాళ్ళందరూ నన్నుసాదరంగా తోడ్కొనివెళ్ళారు ఆత్మీయంగాతొమ్మిదో రోజు .
అల్లంతదూరంనుండే కోటిదీపోత్సవం భక్తిటివి అంటూ కనబడుతున్నది ధగధగాయమానంగా వెలుగులువిరజిమ్ముతూ .ప్రాంగణంలో ఆంజనేయుడు దుర్గాదేవి నంది బొమ్మలు వున్నాయిఅక్కడక్కడ  .అదోలోకం అద్భుతలోకం సురలోకం .జనంజనం ప్రభంజనం ఎటుచూస్తేఅటు కిటకిటలాడుతున్నారు .ఈసారి బాగా వచ్చారు జనం అనిఅనుకుంటున్నారు .మమ్మల్నికాస్త ప్రత్యేకంగా బారీకేడ్లదారిగుండా వాలంటీర్లు పంపిస్తున్నారు. మాచేతిలో దాండియా కర్రలు మా అందరిదీ ఒకేరంగు చీరలు మహాగొప్పగా ఠీవిగా నడుస్తూ మాకుకేటాయించిన డయాసుదగ్గరికి చేరుకున్నాము .హమ్మయ్య ఇక్కడకాస్త ప్రశాంతంగా ఉందని మా గ్రూపులోని పిన్నిగారిని కూర్చోబెట్టి మా హ్యాండ్బ్యాగులూ ఆమెవద్దపెట్టాము .అలాంటి డయాసులు రకరకాల ఎత్తుల్లో కొలతల్లో అటూఇటూచాలానే వున్నాయి. దేవేరులిద్దరిమధ్య శ్రీవేంకటేశ్వరుడు తెల్లనిరాళ్ళుపొదిగిన విగ్రహాల్లో దేదీప్యమానంగా తళుకులీనుతూ భక్తులను పరవశింపచేస్తున్నాడు. మరోవైపు రెండు మూడు దొంతరలుగావున్న అతి పెద్ద డయాస్ మీద వెనుక వైపున చాలా పెద్దగా హిమశిఖరం పైన పరమశివుడు శివుని పై చంద్రవంకా ముందర ఎత్తైన శివలింగం మరోపక్క మంచు లింగం వుండి చూపుతిప్పుకోనివ్వట్లేదు. మాస్టర్ తన మూడు గ్రూపులతో దేవుని శావకి ముందు డమరుక నాదాలతో, వాయిద్యాలతో వున్న తోవలో దాండియాచేయిస్తూంటే అందులో భాగమైనాము .మామధ్యలోకి ఎవరూ రాకుండా అంతరాయం కలుగకుండా రెండు బారికేడ్లమధ్య వాలంటీర్స్ మమ్మల్ని అలా తీసుకెళ్లారు. ఎదురెదురు నిలబడి కోలాటం వేస్తూ నడుస్తూ వెళ్తున్నాము. మధ్యలో ఒకతను నడిచే దారి వుండటానికి అటూఇటూ నడుస్తునేవున్నాడు.  పీఠాధిపతి గారూ పారిశ్రామిక వేత్తలూ మా మధ్యలోంచివెళ్ళి శివలింగం ముందు దీపాల్ని వెలిగించారు . అలా అలా నిరంతరాయంగా 45 నిమిషాల సేపు ప్రాంగణం అంతా మలుపులు తిరుగుతూ దాండియాచేస్తునే వున్నాము.  చెమటలు పడుతున్నాయి దాహం వేస్తుంది కాళ్ళులాగుతున్నాయి అయినా ఏదో ఉత్సాహం .దాండియాచేస్తూ వెళ్తుంటే దారికి ఇరువైపులా బారులు తీరిన జనం వాళ్ళ ఫోన్లో వీడియోలు తీసుకుంటున్నారు. మంచినీళ్లు అందిస్తున్నారు మాకు .చాలదాఇదిమాకు ఇంకేం కావాలి. అహో పరమాద్భుతం. ఆతర్వాత దాండియాగ్రూపు మళ్ళీ ప్రధాన డయాస్ మీద కూడా తందనానా అహో అంటూ చేసారు. ఓవైపు ఆవులేగకు పాలిస్తున్న ద్రుశ్యం,మరోవైపు మహానంది.  మధ్యలో వేదపండితులు మంత్రోచ్చారణలతో శ్రీనివాసుని కల్యాణం చేసారు.  దేవతలంతా భూలోకం తరలివచ్చారా అన్నట్లుగా వుంది.  ఒకరిని మించి ఒకరం చేయాలనే ఆరాటం .డ్రోన్ లో వీడియో తీస్తున్నారు క్రేన్తో వీడియో తీస్తున్నారు .ఈ మాయలో అలసట మరచి ఆనందంగా వేస్తూవేస్తూ తిరిగి మా డయాస్ దగ్గరికి చేరాము.  కాసేపట్లో అందరూ దీపాలు వెలిగిస్తున్నారు . చాలా పెద్ద ప్లేటు మధ్యలో దీపం .ఇలాంటివి చాలా వున్నాయి వరుసగా. దొంతరలుగావున్న దీపాలు కూడా చాలా వున్నాయి వత్తులు వేసి నూనె వేసి రడీగా. నాగదీపాలట మూడు నాలుగు వున్నాయి. నాలుగు వరుసలుగా ఫ్రేమ్ చేసి దానికి ప్రమిదలు వెల్డ్ంగ్ చేసి ఓవైపు పాముపడగలాగా పైకిలేపి దానికి దీపాలు పెట్టి మధ్యలో ఒకతను నిలబడి తనపైకండువాతో రెండు వైపులా స్టాండ్కికట్టి మెడమీద వేసుకొని దాన్ని తిప్పుతూ వున్నాడు వెలుగుతున్న దీపాలతో.  ఇక అఘోరా వేశాలువేసినవాళ్ళు త్రిశూలం తో ఎగురుతూ తిరుగుతున్నారు . త్రిశూలం మధ్యదానిలోంచి వెలుగులు చిమ్ముతున్నాయి. ముచ్చటగా వుంది ద్రుశ్యం.

అప్పటి దాకా ధగధగాయమానంగా వెలుగుతున్న కరెంటుని ఆపేశారు. ఒక్కసారిగా భక్తులు తమతమ తావులలోని నూనె దీపాలు వెలిగిస్తున్నారు. శివతాండవం పాటలు పెద్దగా పెట్టారు . బ్రహ్మాండంగా తయారైవచ్చిన నర్తకీమణులు లయబద్దంగా నాట్యం చేస్తున్నారు. వారి ముందు మేము దొంతరదీపాలు పట్టుకుని నిలబడినాము. వారికి వెనుక వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవార్ల అలంకరణలతో ఇద్దరు పిల్లలు నిలుచున్నారుపైన. మాఅందరి వెనక ఎత్తైన శివలింగం వుంది.  క్రేన్ బుట్టలో ఇద్దరు ఎక్కి పైకి వెళ్లి ఆ శివలింగం పైన పూలు చల్గుతున్నారు. పటాకులు పేల్చారు. మావెనుకవరుస నాట్యగత్తెలు కూడా పూలు దోసిళ్ళతో జల్లుతున్నారు.

ప్రాంగణం అంతా కర్పూర పరిమళాలు దీపాలపొగ ఓపెన్ ప్లేస్. చల్లని గాలులు ఆధ్యాత్మిక వాతావరణం శివతాండవ న్రుత్యాలు పాటలకి వళ్ళంతా కళ్ళే అయ్యాయి. శివోహం శివోహం అంటూ మనసు పాటపాడుకుంటున్నది. పరిపూర్ణ ఆనందం ప్రతివారికి ప్రసాదం గా అందింది. పట్టుపట్టి తీసుకెళ్ళిన నావాళ్ళందరికీ, గ్రూపు సభ్యులకు,గణేశ్ మాస్టర్ కి భక్తి టీవీ వారికి వందనాలు.

Saturday, 18 August 2018

కంబోడియా

 
  ఈమధ్య మా స్నేహితులతో కలిసి కంబోడియా వెళ్ళి వచ్చాము. అక్కడ బల్లపరపుగా వున్న బండలపై ప్రవహించే వాగు లో ఆబండలపై శివలింగాలుచెక్కివున్నాయి .ఒకటో రెండో కాదు వేవేల లింగాలు అలా కనుచూపుమేర నీటిలో పారదర్శకంగా కనిపిస్తూ కనువిందు చేస్తాయి.  ఒకచోట శ్రీమహావిష్ణువు శేష శయ్యపై పవళించగా లక్ష్మీ దేవి కాళ్ళు పడుతున్న ద్రుష్యం కూడా కనబడుతోంది.  దీర్గచతురస్ర ఆకార పరిధిలో యాభైయ్యారు లింగాలున్నాయి.  అలా కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, మరికొంచెం పెద్దవిగా వున్నాయి. పచ్చని పరిసరాలతో చల్లనిగాలులతో మనకు స్వాగతం పలుకుతోంది. పవిత్ర జలమని ఆనీటిని తీసుకుని తలపై చల్లుకుంటూ తన్మయులయ్యాము. ఆపక్కనే ఊయల ఏర్పాటు చేశారు ఎందుకోఏమో. తలాకాసేపు ఊగుతూ సంబరపడినాము. ఒక్క సారి ఊహించండి ఎంతటి ఆనందం మన సొంత మో. 

 కంబోడియా రాజుకి ఈనీటితో మంగళస్నానం చేయించేవారట. అంకుర్వాట్ ఆలయ పరిసరాల్లోని ఈపవిత్రజలాల్ని దాదాపు నాలుగైదు గంటల ప్రయాణ సమయం తర్వాత రాజధాని ఫెనాంఫెన్ లోని రాజప్రాసాదానికి తెచ్చి గంగాళాల్లో నింపి మంత్రోఛ్చారణలతో స్నానం చేయించేవారట.

Monday, 23 July 2018

ఓ బిడ్డ కథ.

  ఆనూనె ఇసుంటబెట్టు అంటూ కాస్త చేతికి తీసుకుని నెమ్మదిగా కాళ్ళకు నూనె రాస్తూ... ఏందేఇదీ ఎన్నాళ్ళు ఇలా బాధపడుతవ్. ఇగ తగ్గదా బిడ్డా. మంచి డాక్టర్లు ఎవ్వరు లేరా.  ఇంకెక్కడన్నా ఎంతఖర్చయినా సూయించుకుందాము. దేశంలో ఎవ్వరు లేరానె దీన్ని బాగుజెయ్య. ఎంతో ఆవేదనగా అంటున్న తల్లికి  వారానికి రెండు సార్లన్నా ఇలా బాధపడుతున్న తనకు ఏంచెప్పాలి .

  తగ్గదమ్మా ఇద్దరు డాక్టర్లు ఇదే చెప్పారు. ఇక ఇంతే ఇట్లనే బతకాలి అంటూ నిట్టూర్పు విడిచింది అమ్మాయి. ఇలా ఎన్నిసార్లు చెప్పినా మరచిపోయి ఆ వాసినకాళ్ళను చూసినప్పుడల్లా బాధపడుతునేవుంటది. తనకొచ్చిన అనారోగ్యం చెప్పలేక తనకు క్యాన్సర్ అని, రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి ఆముసలితల్లిని బాధపెట్టటం ఎందుకని లోలోపల మదనపడింది. ఏదో లేవే ఈమాత్రం తిరగగలుగుతున్నా. ఇంట్లో అందరికీ నా చేతనయినంతవరకూ సహకరిస్తున్న. నలుగురు పిల్లలు స్కూలుకు వెళ్ళొస్తరు. ముగ్గురు పనోళ్ళకువేళకింత పెట్టాలి. పనులు పురమాయించాలి. కొడుకులు కోడళ్ళు ఎవరిపనికివారు వెళ్తారు నన్ను నమ్ముకుని. వాళ్ళకి నాఅవసరం వుందో లేదో తెలియదు కానీ నేనైతే కాస్తో కూస్తో ఉపయోగపడుతున్నాననే అనుకుంటున్నాను. ఇక మీఅల్లుడు. ఏంచెప్పాలి ఎప్పుడూ ఫోను తోనే . నేను బాగనే వున్నననుకుంటడు. నామీద ఎంత నమ్మకం. ఆయన టెన్షన్ లు బిజినెస్ ముచ్చట్లు వినాలి. అమెజాన్ నుంచి ఏదో వస్తుంది తీసుకో అంటరు, కొరియర్ అంటూ ఎవరో వస్తారు. ఇంత ఇంట్లో ఎప్పుడూ ఏదో రిపేరు. నాకు చేతగాదురబాబూ అన్నా ఒక్క సారి పైఫ్లొరుకొచ్చి చూడండి మేడమ్ అంటారు. కింద కొమ్మలు కట్ చేయమంటే నున్నగా కొరిగేస్తరు నేను లేకుంటే. మద్యాహ్నం లంచ్ కి ఒక్కొక్కరు ఒకసారి వస్తారు చూస్తున్నావుగా.

   ఇక రోజుకు ఐదారు సార్లు నా మందులు వేసుకోవాలి. నాపాలిట వరమేంటంటే ఇంకా షటిల్ ఆడడం. పొద్దున్నే నీపాడ్స్ వేసుకుని డ్రెస్ ఛ్చేంజ్ చేసుకుని షూస్ వేసుకుని వెళ్ళొచ్చాక చీర , కాళ్ళకు స్టాకింగ్స్ వేసుకుని ఎన్నని చెప్పను. ఎవ్వరూ నొచ్చుకోకుండా ఎవరి భావోద్వేగాలు దెబ్బతినకుండా ఇంతమందిని కనిపెట్టుకుంటాను. ఏఇంట శుభకార్యం జరిగినా ఏ కార్యక్రమం వున్నా నేనే పోవాలి. ఎవరికీ తీరదుగా. అమ్మా జీవితం చాలా విలువైనది. దాని విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ కొద్ది సమయంలో  సమాజానికి, కుటుంబానికి, పరివారానికి ఏదో చేయాలని తపన. అందుకే అమ్మా నేను బ్రతకాలి. నాకు బ్రతకాలనుందమ్మా.  నా మనవడూ, మనవరాళ్ళూ దినదినప్రవర్దమానమౌతూ సహస్రదళపద్మాల్లా వికసిస్తుంటే చూడాలనుందమ్మా. కనీసం నువ్వు వున్నంతవరకైనా  నీకోసమైనా బ్రతకాలనుందమ్మా. నా బరువుని ఎవరిపై మోపనమ్మా అనుకుంటూ లోలోపల ఉబికి వస్తున్న నీటిని లోపలే అదిమి తనకు సేవచేస్తున్న తల్లికి మనసు లోనే వందవందనాలు సమర్పించుకుంటూ తడితో తరళాయితమైన కన్నులు తుడుచుకుంటూ లేచింది అక్కడి నుండి.

Monday, 2 July 2018

మర్రిచెట్టు

 
   అదే అక్కడ కనబడుతోంది చూడండి మర్రిచెట్టు.  మర్రిచెట్టుకు ఊడలువేసి ఎంత బాగుంది.  చిన్నప్పుడు ఆ వూడలుపట్టుకొని ఉయ్యాలలూగిన రోజులు మరొకసారి మనోఫలకంపై తేలియాడింది.  శిశిరంపోయి ఆమని వచ్చేవేళయిందేమో ఆకులన్నీ నవవసంతానికి స్వాగతమంటూ లేలేత చిగురాకుపచ్చఆకులతో శాఖోపశాఖలుగా విస్తరించి ఉమ్మడి కుటుంబం లా చూపరులకు ఆనందాన్నిస్తున్నది.  దాని కింద సిమెంటు గట్టు రచ్చబండై ఎన్ని వివాదాల్ని పరిష్కరించిందో ఎన్నింటికి మూగసాక్షై నిలిచిందో. ఈచెట్టు ఇంట్లో వుంటే ఎంత బాగుండు కానీ వద్దంటారే అందరూ. 

  అదిగదిగో పిచ్చుకలు వైనవైనాలుగా కొమ్మకొమ్మకు ఎగురుతూ నన్ను వెక్కిరిస్తున్నాయి నీవు నాలాగా ఎగరలేవుగా అంటూ.  అమ్మో దాని మొదట్లో ఎన్నిఊడలు  దాని కైవారమెంతవెడల్పుగానున్నదో...అందులో ఆకలుగుల్లో  పాములున్నాయేమో...ఆ...వుంటే వుండనీగాక  మనలోమాత్రంలేరూ అంతకన్నా విషపునాగులూ. అందర్నీ కలుపుకుని పోవడమేగా జీవనయానం. ఏమంటారు.