Thursday 12 October 2017

చిలిపి ఊహ.


    చెలీ  లేలేత సూర్యకిరణాలు తనువంతా స్పర్శిస్తూ ఆస్వాదిస్తూ నీవైపు నన్ను లాగుతున్న బలీయమైన
కారణమేదో తెలుసా?  షటిల్ ఆడుతున్న నన్ను నీవు ఒక్క సారైనా చూసి హాయ్ చెబుతావేమోనని చెమటలతో తడిసిన నామేను నీ పలకరింపుతో తడారిపోతుందని ,నీ రంగు పులిమిన అధరాలలోంచి వినీవినపడని
పదాలేవో అలా అలా అలవోకగా తేలి నావైపు పరుగులతో వస్తుంటాయని ఎంత ఆశగా వున్నానే...

   మొన్నామధ్య కలిసినప్పుడు ఎన్నిబాసలు చేసావు. ఎన్ని కబుర్లు చెప్పావు.  వారంలో ఒక సారైనా
బైట అలా చెట్టాపట్టాలేసుకుని తిరగాలని అనలేదూ!  ఒక సినిమా ఐనా చూద్దామని చెప్పలేదూ.  కాఫీడేలో
కాఫీతాగుతూ కబుర్లతో కాలక్షేపం చేస్తూ గడుపుదామని బాస చేయలేదూ.  ప్రియసఖీ అవన్నీ వట్టి మాటలేనా
నీటి మీద రాతలేనా  మరి నేనేమిటిలా  పిచ్చిదానిలా ప్రతిరోజూ నీవేదో నాకోసం పరితపిస్తున్నట్లుగా ఇలా
భ్రాంతి కలుగుతున్నదేమి?  ప్రేమంటే ఇద్దరికీ ఒకేసారి ఒకే భావన కలుగుతుంది అంటారుకదా !  నీకేమీ
లేదా  దేవుడా ! నాకెందుకిలా. 

   ఒక్క సారైనా ఒక్క రోజైనా ఆతలుపు తెరుచుకుంటుందని, కిటికీ ప్రక్కన వేచి చూస్తున్న నన్ను చూసి
ఆనందంతో గెంతులేస్తావని ఎన్ని ఊహలతో ఎన్నెన్ని జ్ఞాపకాలతో ఎంతకాలమని ఎదురుచూడను?
  ప్రియతమా! అయినా  అయినా నీపై నాకెందుకు కోపం రావడంలేదు తెలుసా?  నాలో వున్న ప్రతిభను
 నీవు మాత్రమే గుర్తించావని . దూరం నుంచే ఒక్క చిరునవ్వు, నీకరచాలనము, భావోద్వేగపూరిత
 వీక్షణం నీగవాక్షమునుండి నేనాశించడం నేరమా  కాదు కానేకాదు ఎవరెన్ని చెప్పినా నామనసు మొరా
యిస్తున్నది.  నిన్నువదిలి రాలేనంటున్నది మరిఎలా?

  అందుకే ఈపత్రలేఖనము. ప్రతి రోజూ నీఇంటివైపే చూస్తూ భావలోకాల్లో విహరిస్తూ ఎడబాటు భరిస్తూ
 అక్షరాక్షరాల్లో జీవిస్తూ... దేశదేశాలు దాటిన నాచెలి రాకకై  చకోరపక్షిలా..... నీ   మనోమంజరి.

Tuesday 19 September 2017

ధర్మశాల

 
   ధర్మశాల  వెళ్ళి మందులు తెచ్చుకోవాలని ఎప్పటి నుండో అనుకున్నది గతవారం వెళ్లి వచ్చాము.
   డాక్టర్ కెల్సంగ్  టిబెటియన్ ఆయుర్వేద హాస్పిటల్ వుంది. మాకు తెలిసిన వారు చెప్పగా వెళ్లి
   వచ్చాము.  కీమో తర్వాత వెళ్దామని ఆగాము ఇన్నాళ్లు.  హైదరాబాద్ నుండి ధర్మశాల కు ఫ్లైట్ లో
   వెళ్లాము.  వుదయం ఆరుగంటలకు ఎక్కిన మేము ధర్మశాల లోని కాంగ్రా ఏర్పోర్ట్ చేరేసరికి మధ్యాహ్నం
రెండు అయింది.  అక్కడి నుండి టాక్సీ లో ఆరు కిలో మీటర్లు ప్రయాణించి హోటల్ కి చేరి లంచ్ చేసి
   లగేజీ రూంలో పెట్టి ఎదురుగానే వున్న హాస్పిటల్ కెళ్లాము .ఎటునడవాలన్నా ఎగుడుదిగుడుగా
   వుంది.  గుట్టలు చెట్లూ, పచ్చగా ఆహ్లాదంగా వాగులూవంకలూ, అక్కడక్కడా దూరంగా చిన్న ఇళ్ళు,
   సమతల భూభాగంలో పంటచేలతో మనోల్లాసం కలిగిస్తున్నాయి  పరిసరాలు.
  
      
       హాస్పటల్లో ముందుగా పేరు రాయించాలట ఆతర్వాత రిజిస్ట్రేషన్ చేయించాలట.  ఆ మనిషి
   ఎప్పుడు వస్తాడో తెలియదు. రాగానే చుట్టూ ఇరవైమందిదాకా మూగారు గుంపుగా. పేషంట్
   ఒరిజినల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వాలి అక్కడ.  మరునాటికి మన వంతు రావచ్చు డాక్టర్ ని కలవ
   డానికి. ఆరోజు వుదయం పట్టిన మూత్రం దాదాపు 120ml చిన్న బాటిల్ లో తీసుకుని వెళ్ళాలి.
    దాన్ని ఒక బౌల్లో పోసి కర్రపుల్లతోతిప్పి పారబోసి బాటిల్ పడేసి చేతులు శుభ్రంగా కడుక్కొని
    వచ్చి మన వివరాలు అడిగి మన ఫైలు చూసి మందులు రాసి ఇస్తాడు. బిల్లు పేచేసి మందులు
    తీసుకుని రావాలి. పక్కనే వున్న క్యాంటీన్ లో టీ తాగుతూ స్నాక్స్ తింటూ బెంచీలపై,కుర్చీ లపై
    కూర్చొని ఎదురు చూస్తుంటారు అందరూ. దాదాపు వంద మంది దాకా చూస్తాడు రోజూ డాక్టర్.
    రోజూ నాలుగు సార్లు వేసుకోవాలి మందు గోలీలు.  తినగూడనివేమిటో రాసి వుంటుంది.

        తిరుగుప్రయాణం సాయంత్రం వుందని  వుదయం ధర్మశాల సిటీ టూర్ వెళ్ళాం. వ్యూపాయింట్,
    చర్చి,సరస్సు, దలైలామా ప్రాంగణం చూసి వచ్చాము. ఓ ముప్పైనలభై మంది లామాలు కనిపించా
   రక్కడ. అదోలోకంలా వుంది.   దారి పొడవునా దుకాణాలు ఉన్నాయి. పూసలదండలూ,బుద్ధుని బొమ్మలు
    వగైరా.  బూట్లు, చెప్పులు చాలా చవక అనిపించాయి మాకు. అక్కడి ప్రజలు చాలా సౌమ్యంగా
    అనిపించారు.   ప్రక్రుతి సోయగాలు సంపూర్ణంగా ఆస్వాదిస్తన్న అనుభూతి కలిగింది.  ప్రతి బస్సు
    మీద దేవభూమి అని రాసుంది. నిజంగా దేవతలు నడయాడిన భూమే అనిపించింది.  షూస్ తీసుకుని
 వెళ్ళండి సౌకర్యంగా వుంటుంది ఒక వేళ మీరు వెళితే . 30% క్యాన్సర్ పేషంట్సే వస్తారు మిగతా వారంతా
    వివిధ రకాల రోగులు వస్తారు.

Saturday 2 September 2017

విహారి


   ఒక చల్లని సాయంకాలం

అతి శీతల పవన సమీరం

   మా ప్రాంగణ నిలయ నివాసం

  ఆనంద సుమన విహారం


  శుకపిక శారి  "క" పోతము నై

 సు "మ"న విహార విహంగమునై

  తపోన్ముక్త మది సంచరినై

  స్వేచ్ఛా గాలుల మంజరినై


  తిరుగాడే కోనల కందమునై

  బ్రాహ్మీ ముహూర్తపు సమయాన

  సుకవి రచించిన గానమునై

  జనించె కవిత నా హ్రుదిన.

నా సిరి.

 
    చిరుగాలి లా నిను స్పర్శిస్తా

    గలగల సెలయేరయి వస్తా

    నేనేమిటో  నిరూపిస్తా

     అందరితో ఆహా అనిపిస్తా..


    ధ్యానం తో పొందిన కాంతి

    తరగని సిరి నా శాంతి

     గెలుపోటములు నాదరి చేరునా

     తెలిసిమసలుకో  నేస్తమా.

Wednesday 28 June 2017

కీమో.

    కీమో తో మన శరీరం లో ఎన్నో మార్పులు కలుగుతాయి. జుత్తు ఊడి పోతుంది, గోళ్ళు నల్లగా మారతాయి,
   తెల్లరక్తకణాలు తగ్గి పోతాయి. దీంతో వళ్ళంతా నొప్పులు, నీరసం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు
  ఎక్కువగా వుండే టట్లు చూసుకోవాలి. పప్పు,చేపలు, చికెన్, పల్లీలు,నట్స్,పాలు, పాలలో ప్రొటీన్ పౌడర్ వగైరా ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి ఆకులు నీటి లో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకును తీసి ఆనీటిని
 తాగితే తెల్లరక్తకణాలు త్వరగా పెరుగుతాయట. చేదుగా వుంటాయి ఆకుపచ్చ గా వుంటాయి. రోజూ తాగాలి
 ఈమధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది పొప్పడిఆకుల వైద్యం.

       మొదటి సారి కీమో ఇవ్వగానే కొద్ది రోజుల లోనే తలలో ఏదో చిటపట మొదలవుతుంది. చిరాగ్గా వుంటుంది.
    మెల్లగా దువ్వెనతో కొంచెం కొంచెం జుట్టు ఊడుతున్నట్లు గమనిస్తాము. అలా రెండు రోజుల కు చాలా ఊడి
  మాడు కనిపిస్తుంది.  దానిని చూసి మనసు చెదరనీయొద్దు. ఇక లాభం లేదని మనమే పూర్తిగా గుండు చేయించడం మంచిది. తప్పదు. కొందరు ట్రీట్మెంట్ కన్నా ముందే గుండు చేయించుకుంటారు. తప్పని వాటికోసం
  బాధపడటం ఎందుకు?  మధ్యలో కూడా మరోసారి గుండు చేయిస్తే మంచిది.  కీమో అంటే ఒక్క సారితో పూర్తి
  అయ్యేది కాదు. కొందరికి మూడు వారాలకు ఒకసారి, కొందరికి వారం వారం కేసుని బట్టి డాక్టర్లు ప్లాన్ చేస్తారు.
  కీమోకి కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలు కూడా రాలిపోవడం తో మన మొహం మనకే చూడబుద్ది కాదు.
  అయినా పోరాటం చేయాలి. చచ్చే దాకా బ్రతకాలి గా. గెలిచే దాకా అలుపు లేని సంగ్రామం చేయాలి.
  గెలుస్తాము విజేతలవుతాము ఏమంటారు మిత్రులారా...

Tuesday 27 June 2017

కీమో కాన్సర్ ట్రీట్మెంట్


     కాన్సర్ దశలను బట్టి, వచ్చిన చోటునిబట్టి,తీవ్రతని బట్టి ఆపరేషన్, రేడియేషన్, కీమోఅని మూడు
  విధాలుగా వైద్యం వుంటుంది.
 
  ముందు బ్లడ్ టెస్టు చేయించుకుని అన్నీ సరిగా వుంటే మరునాడు వుదయం ఫుల్ గా తిని నార్మల్ గా
  రోజు వేసుకునే మాత్రలు వేసుకొని వెళ్లి కీమో చేయించుకోవచ్చు. నా కైతే ఇలాగే చేశారు అందరికీ ఇలాగే
  చేస్తారో లేదో తెలీదు.  ముందు ప్రీ మెడిసిన్ ఇసస్తారు ఆ తరువాత కీమో మెడిసిన్ ఇస్తారు. ఇదంతా సెలైన్ ఎక్కించినట్లే వుంటుంది.  కంగారు ఏమీ లేదు. ఆందోళన అవసరం లేదు. ప్రశాంతంగా ముగించుకుని ఇంటికి
 రావచ్చు. మరునాడు కూడా ఏమీ కాదు కాస్త నీరసం.  రెండో రోజు మధ్యాహ్నం నుండి నా కైతే విపరీతమైన
 కాళ్ళ నొప్పులు వచ్చాయి.  నడుము కింద భాగం అంతా నొప్పి. ఇక కాళ్ళకు ఆయిల్ మసాజ్ చేయడం నొప్పి
 మాత్రలు వేసుకోవడం మామూలే. అయినా మూడు నుండి ఏడు రోజులు మాత్రం తగ్గలేదండి నాకు.
 ఆ తర్వాత మెల్ల మెల్లగా రోజు రోజు కు ప్రాణం పోసుకుంటున్నట్లు ఆరోగ్యం కుదుటపడుతుంది.  తొలి మూడు
 రోజులకు ఇచ్చిన మాత్రలతో నాలిక రుచిని కోల్పోయి ఏమీ తినలేక  ద్రవాహారంతోనే గడపడమైనది నాకు.

 కొందరికి ఒకటి రెండు వాంతులూ,మోషన్సో,పైల్సో,నోటి పూతో ఇలాగ ఏదో ఒకటి గానీ  మరోటి కలిసి గానీ
  జరగొచ్చు. కానీ, ఏమీ కాదు. ఇది తాత్కాలికమే అని మనకి మనం సర్దిచెప్పుకోవాలి. ధైర్యంగా వుండాలి.
 మనముందు ఎంతో మంది కోలుకుని చక్కగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వారిని చూసి మనం కూడా ధైర్యంగా
  ఆశగా అలా వారిలాగా ఎప్పుడు తిరుగుతామా అని ఆశావహంగా వుంటూ డాక్టర్లకి సహకరిస్తూ వీలయినంత వరకు నలుగురితో వుంటూ వుండాలి. ఒంటరిగా వుండవద్దు.  కనీసం అలా పక్కింటి కైనా వెళ్లి కాసేపుండి
 కబుర్లు చెప్పుకుని రావడం బాగుంటుంది. మంచి మంచి మందులు, మంచి డాక్టర్లు వున్నారు మనకు. జీవితం
 ఇపుడే ముగిసిపోవట్లేదు. మిత్రులారా అధైర్యపడవద్దు. ప్రతి రోజును ఆనందంగా గడపండి ప్రతి రోజును ఆస్వాదించండి సంగీతం తో. సాహిత్యం తో ప్రక్రుతి తో మీదైన లోకంలో .త్వరలోనే మనమూ మామూలు
 జీవితం గడపుతాము. 

Wednesday 21 June 2017

మా అమ్మ కథ.

 
      ఆమెకి 85సంవత్సరాలు. గత సంవత్సరకాలంగా ఆమెకి మతిమరుపు వచ్చింది. పాతవిషయాలన్నీ గుర్తు కున్నాయి కానీ ఇప్పుడు మనమేంచెప్పినా వెంటనే మరచి పోతున్న ది .ఒకే ప్రశ్నని పదేపదే అడుగు తున్నది.  ఇల్లంతా సర్దుదామంటది. సరే అని వెళ్తే పనికిరాని సామానంతా పక్కనబెడితే అవన్నీమళ్లీ లోపల పెట్టేస్తుంది.  చిన్న గుడ్డపీలిక కూడా దాచిపెడుతున్నది.  ఏవస్తువు తనకి నచ్చినా చిన్నగా తీసుకెళ్లి తన రూంలో దాచిపెడుతున్నది.
తన బట్టలు కూడా ఎవరో తీస్తారని వాటిని ఒక బ్యాగులో పెట్టి దాన్ని మరో బ్యాగులో పెట్టి జిప్ లాగి గట్టిగా ముడి వేసి  దాని మీద శద్దరు,పైన టవలుకప్పి కబ్బోర్డు మూసి ఆపైన చిన్న నిచ్చెన నిలబెట్టి, రెండు కుర్చీలు అడ్డంగా పెట్టి
తలుపు వేసి ఇక ప్రశాంతంగా బైటికి వస్తుంది మాఅమ్మ. మచ్చుకు ఇదొకటి మాత్రమే ఇంకా ఇలాంటివి ఎన్నో.

Friday 21 April 2017

పడమటర్ర.

   
     తాత,అమ్మమ్మలకు ఒక్కతేకూతురు అమ్మ .ఒకేఊరు. అమ్మమ్మ వాళ్ళిల్లు పాతబజారులో
    మాఇల్లుకొత్తబజారులో రోడ్డుకు దగ్గరగా వుండేది. వంటంతా ఇక్కడే. అమ్మమ్మ,తాతయ్యలు పొద్దున్నేచెలక,పొలం వ్యవసాయంఅంటూ వెళ్ళేవారు. వారికి సద్దిగిన్నెలు అన్నయ్యో,నేనో జీతగాళ్ళో
   తీసుకెళ్ళేవాళ్ళం.  సాయంత్రం కూడా సద్దిగిన్నెలు మాఇంట్లోంచి అమ్మమ్మ ఇంటికితీసుకెళ్ళేపని
   ఎక్కువగా నాకే వుండేది. ఆటైంలో నేనుఐదోతరగతో ఆరోతరగతో చదివేదాన్ననుకుంటా. అక్కడికి
   వెళ్లాలంటే చాలా వుత్సాహంగా వుండేది.

     అమ్మమ్మ పడమటర్రలో(గదిలో)బెల్లంకుండ వుండేది. మాకుతిరిగివచ్చేటపుడు చేతిమీద అరచేయి
    వెనుకవైపు నిమ్మకాయంత బెల్లం పెట్టి పంపేది. అదినాకుతూనాకుతూమాఇల్లు చేరేదాన్ని. అపుడపుడు
    అక్కయ్య కూడా తోడుగా వుండేది. ఆగది చీకటిగా గబ్బిలాలవాసనతో ఒక్కకిటికీ కూడాలేకుండా
     వుండేది. తడుముకుంటూ వెళ్లి బెల్లంకుండ ఎక్కడవుందీ కనిపెట్టేవాళ్ళం. మాతాతయ్య ఆయనజన్మించినసంవత్సరం(పింగళి) జన్మనామం వగైరా కాగితాలు,భూమికొన్న కాగితాలు ఎక్కడ
   ఎలా దాచేవారో తెలుసా ? లావాటి వెదురు కర్రల కణుపుల దగ్గర కట్ చేసి ఈకాగితాలు రోల్లాగా
   చుట్టి అందులో దూర్చి దానిపైమరో వెదురుబుర్ర తొడిగేవాడు. అందులో పేపర్లు వుంటాయని ఎవరూ
    ఊహించలేం కదా.
  
    ముఖ్యమైన సామానులన్నీ పడమటర్రలలోనే భద్రపరిచేది అమ్మమ్మ. గదినిండా కుండలూ,బానలూ,
    బస్తాలే . ధాన్యం, పప్పులు,బియ్యం,వడ్లు,ఉప్పుబస్తాలు,బెల్లంబుట్టలు,వేరుశనగలు,గోగునారతాళ్ళు,
     పశువులకు సంబంధించినసామాన్లు,పెద్దబోషాణం అందులోకొన్ని పట్టుచీరలు డబ్బులు ఇలా ఒకటేమిటి
    చీకట్లోఆగదిలోకెళ్తే కాళ్ళకువేళ్ళకు ఏవో తగుల్తూనే వుండేవి. దాదాపు 50 సంవత్సరాల గతం నామదిలో
    సజీవంగా నిక్షిప్తమై అపుడపుడు మలయమారుతంలా పలకరిస్తూనే వుంటుంది ఇలాగ.

Monday 13 February 2017

అక్షరవనం



   నిన్ననేను ఒకమంచి కార్యక్రమానికి వెళ్ళాను .హైదరాబాదు నుండి రెండుగంటల ప్రయాణం కారులో. శ్రీశైలం వేళ్ళేదారిలో కల్వకుర్తి అనే ఊరిలో వందేమాతరం ఫౌండేషన్ వారి అక్షరవనం కార్యక్రమానికి వెళ్ళడంజరిగింది .మాధవరెడ్డిగారు తన స్వంతవ్యవసాయభూమిని, తన సమయాన్ని,తన పరివారం మొత్తంగా ఈప్రాజెక్టు పైనే వెచ్చిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు .ప్రభుత్వ పాఠశాలలనుండి పేద విద్యార్థులను తెచ్చి వారికి శిక్షణ ఇచ్చి వారిపై రీసెర్చి చేస్తూ భావి విద్యార్థులకు మేలైన విద్యను ఎలా అందించాలనే ఆలోచన ఆయనది. ఒక గ్రంధాలయం,ధ్యానమందిరం నిర్మాణంలో మాకుటుంబం పాలుపంచుకోవడం గర్వించదగిన విషయమని నేననుకుంటున్నాను. విశాలమైన వరండాలు,కూర్చోడానికి గ్రానైటుబెంచీలు,చుట్టూ మామిడిచెట్లు,చింతచెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్షరవనం రూపుదిద్దుకుంటున్నవైనం నన్నెంతో ఆకర్శిస్తూంది. వారి నినాదం చదవండి మరచిపోండి. బట్టీ విధానం కాకుండా చదువంటేభయంలేకుండా చేయడం. బడిపుస్తకాలు కాకుండా గ్రంధాలయంలోని పుస్తకాలు వారికిఅందుబాటులో వుంచి దాదాపు ప్రతి విద్యార్థి రెండువందల పుస్తకాలైనా చదవాలని,చదివినవి మెదడులో ఎక్కడో నిక్షిప్తమై వుంటాయనేవారి ఆలోచన బాగుంది. అలాగే పిల్లలే వంటచేయడం,అన్నిపనులు నేర్చుకోవడం వారికున్న నైపుణ్యాలుప్రదర్శించడం,వారే గురువులుగా మారిచెప్పడం, అన్ని విధాలుగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తున్నారక్కడ. గవర్నమెంటు టీచర్లు దాదాపు రెండువేలమంది ఇక్కడ ట్రైనింగు తీసుకుని వెళ్ళారంటే వీరి శ్రమ కృషి ఏపాటివో మనం అర్థం చేసుకోవాలి.  మాధవరెడ్డిగారి కుటుంబానికి,ఆ మహా యగ్నంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వారు ధన్యులు.

Friday 6 January 2017

    ధన్యవాదాలు.


        గుండె గొంతుకలోన కొట్లాడుతోంది  తోవ తెలియక నాడు అల్లాడిపోయింది.
    
        చెప్పరే నా గొంతు ఎక్కడే దాగుంది  కూనిరాగాలు మౌన వీణంగ మార్చింది

      నా బంధుమిత్రువులు తోడుగా నిలిచారు  నాకోసమై వారు పరితపించారు

     ఎవ్వరే నాకిన్ని నీళ్ళు పోస్తోంది   చూడరే మారాకు చిగురు వేస్తోంది
  
     చాలదా ఇది నాకు బ్రతుకు భారాలేల  తిమిరంతో సమరాన గెలుపుభావాలెల్ల

     ధన్యవాదము చెప్ప నది చిన్నమాటాయె  వేరె దారిలేక రాతలే తోడాయె.